ప్రజా పద్దుల కమిటీ

ఇది భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొనసాగుతోంది. ఈ కమిటీకి తొలి చైర్మన్‌గా డబ్ల్యూ.ఎమ్. హెయిలీ (1921) నేతృత్వం వహించారు. ప్రస్తుతం చైర్మన్‌గా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవీ థామస్ వ్యవహరిస్తున్నారు.

నియామకం:
ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు పార్లమెంటు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో 22 మంది ఎంపిక చేసిన ఎంపీలు (15 మంది లోక్‌సభ, 7 మంది రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సభ్యుడి ఎంపికను పార్లమెంటు స్పీకర్ చూసుకుంటారు.

విధులు:
రైల్వే, రక్షణ, పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలపైన కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది. పార్లమెంటు ద్వారా ఏ శాఖలకు ఎంత నిధులు మంజూరయ్యాయి. వాటి వినియోగం, ఖర్చులపై ఆరా తీస్తుంది. అలాగే వివిధ శాఖల వ్యయాలపై కాగ్ ఇచ్చిన నివేదికలపైనా పరిశీలన జరుపుతుంది. ఆయా శాఖలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని అధికంగా ఖర్చు పెడుతున్నాయో ? లేదా? పర్యవేక్షణ జరుపుతుంది. అంటే కేవలం పెట్టిన ఖర్చులపై మాత్రమే కాకుండా పెడుతున్న ఖర్చులపై కూడా కన్నేసి ఉంచుతుంది. తద్వారా నిధుల దుర్వినియోగాన్ని అదుపు చేయడం కమిటీ ప్రధాన లక్ష్యం. అలాగే, ఆయా శాఖల ఖాతాల నిర్వహణలో అవలంబిస్తున్న సాంకేతిక విధానాలను పరీక్షిస్తుంది. ఆయా శాఖల ఖర్చుల పద్దులపై ఉన్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వాటిని యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచుతుంది.

2011లో 2జీ కుంభకోణంలో జరిగిన అవకతవకల్ని ప్రజా పద్దుల కమిటీ ప్రజల దృష్టికి తీసుకువచ్చింది. ఇంతవరకు భారతదేశంలో వెలుగుచూసిన అతి పెద్ద కుంభకోణాల్లో ఇదీ కూడా ఒకటి కావడం విశేషం.

Comments

comments